గతంలో దిగ్గజాలు సైతం ఓడిపోయారు.. శ్రేయస్ 'గొప్ప కెప్టెన్ అవుతాడు' అంటూ అండగా నిలిచిన సోదరి

  • టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు కలిసిరాని ఆరంభం
  • వరుసగా ఐదు టీ20 మ్యాచ్‌లలో విజయం లేకపోవడంతో తీవ్ర విమర్శలు
  • విమర్శల వేళ తమ్ముడికి పూర్తి మద్దతుగా నిలిచిన సోదరి శ్రేష్ఠ అయ్యర్
  • శ్రేయస్ భవిష్యత్తులో దేశ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలుస్తాడని ధీమా
  • దిగ్గజ ఆటగాళ్లు కూడా ఓడిపోయారంటూ విమర్శకులకు గట్టి సమాధానం
టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రేయస్ అయ్యర్‌కు ఆరంభం ఏమాత్రం కలిసిరాలేదు. అతని నాయకత్వంలో జట్టు వరుస ఓటములతో సతమతమవుతుండటంతో, కెప్టెన్‌గా శ్రేయస్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో అతని సోదరి శ్రేష్ఠ అయ్యర్ పూర్తి మద్దతుగా నిలిచింది. వరుస వైఫల్యాలు ఎదురైనా, భవిష్యత్తులో శ్రేయస్ భారత క్రికెట్ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలుస్తాడని ఆమె ధీమా వ్యక్తం చేసింది.

బ్రిడ్జ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 125 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం పాలైంది. 202 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. పరుగుల పరంగా టీ20 చరిత్రలో భారత్‌కు ఇదే అతిపెద్ద ఓటమి. అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. దీంతో శ్రేయస్ కెప్టెన్సీలో భారత్ వరుసగా ఐదు టీ20 మ్యాచ్‌లలో విజయం సాధించలేకపోయింది. భారత టీ20 చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.

ఈ నేపథ్యంలో శ్రేయస్‌పై విమర్శలు వెల్లువెత్తుతుండగా, అతడి సోదరి శ్రేష్ఠ గట్టిగా స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, గొప్ప క్రికెటర్లు అందరూ తమ కెరీర్‌లో ఇలాంటి కష్ట సమయాలను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. "శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు కూడా ఎన్నో మ్యాచ్‌లు ఓడిపోయారు కదా?" అని ఆమె ప్రశ్నించారు.

ఓటములకు కేవలం శ్రేయస్‌ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదని ఆమె హితవు పలికారు. "ప్రతిసారీ మీరు శ్రేయస్‌ను మాత్రమే వేలెత్తి చూపిస్తుంటే, సమస్య అతనిలో కాదు, బహుశా మీలోనే ఉన్నట్టుంది. అతను ఒక అద్భుతమైన వ్యక్తి. ఇతరుల కంటే జట్టుకు ఎంతో మేలు చేయగల సత్తా అతనికి ఉంది" అని ఆమె వ్యాఖ్యానించారు.

ఇంతటితో ఆగకుండా తన సోదరుడి కెప్టెన్సీ భవిష్యత్తుపై ఆమె కీలక జోస్యం చెప్పారు. "ఆ సమయం చాలా త్వరలోనే రాబోతోంది. శ్రేయస్ అయ్యర్ భారత్ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడని ప్రజలే అంటారు. అది కచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నిజానికి, ఆ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది" అని శ్రేష్ఠ ధీమాగా పేర్కొన్నారు.

ఒకవైపు కుటుంబం నుంచి ఇంతటి మద్దతు లభిస్తున్నా, కెప్టెన్‌గా శ్రేయస్‌పై ఒత్తిడి తీవ్రంగానే ఉంది. ఇంగ్లండ్‌తో ఓటమి అనంతరం తమ జట్టు 'దారుణమైన క్రికెట్' ఆడిందని స్వయంగా శ్రేయస్ అంగీకరించడం గమనార్హం. ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లలోనైనా జట్టును విజయపథంలో నడిపించి, తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తో, కెప్టెన్సీతో సమాధానం చెప్పాలని శ్రేయస్ పట్టుదలగా ఉన్నాడు.

Shreyas Iyer
Shrestha Iyer
Indian Cricket Team
T20 Captaincy
India vs England
Cricket News

More Telugu News